యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న ముగ్గురు సీఎంలు

బుధువారం సీఎంలు కేసీఆర్‌, పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌లు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. వీరితో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రులకు వేదమంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలతో సత్కరించారు.

ఖమ్మం బిఆర్ఎస్ సభకు ముఖ్య అతిధులుగా కేరళ సీఎం పినరాయి విజయన్‌, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ లతో పాటు సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా పాల్గొననున్నారు. ఇందుకోసం వీరు నిన్న రాత్రే హైదరాబాద్ కు చేరుకున్నారు. కొద్దీ సేపటి క్రితం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని ముగ్గురు సీఎంలు దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి చేరుకున్న సీఎంలు కేసీఆర్‌, పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌కు అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరి గుట్టలో సుమారు 1600 మంది పోలీసులను మోహరించారు. దర్శనం అనంతరం సీఎంలు ఖమ్మంలో జరగబోయే బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభకు వెళ్తారు.