కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం – సీఎం జగన్ మోహన్ రెడ్డి

కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని లక్ష్యంతో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ..సరికొత్త ప్రణాళికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో నేరుగా భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా కుప్పం నియోజకవర్గ కార్యకర్తల్లో భేటీ అయ్యారు.

గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్‌ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానమని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. భరత్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానన్నారు. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పంకు అత్యధికంగా మేలు జరిగిందని ఆయన వెల్లడించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.

కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తున్నాం. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటాం అని సీఎం జగన్‌.. కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్‌.. దిశా నిర్దేశం చేశారు.