యాదాద్రి కూడా హైదరాబాద్ లో కలిసిపోనుంది: సీఎం కేసీఆర్
యాదాద్రి : సీఎం కెసిఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లడుతూ.. భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా ఏర్పాటును ఎవరూ ఊహించలేదన్నారు. ఉమ్మడి ఏపీలో జిల్లా ఏర్పాటు కోరినా సాధ్యపడలేదని వెల్లడించారు. ఎన్టీఆర్ను మంచిర్యాల జిల్లా కావాలని అడిగినా అదీ సాధ్యపడలేదని గుర్తు చేశారు. భువనగిరి సులువుగా అభివృద్ధి చెందే ప్రాంతమని స్పష్టం చేశారు. హైదరాబాద్, వరంగల్ అద్భుతమైన కారిడార్గా అభివృద్ధి చెందుతాయని వివరించారు. యాదాద్రి కూడా హైదరాబాద్ లో కలిసిపోతుందన్నారు.
భువనగిరిలో ఇప్పుడు రూ.2-3 కోట్ల వరకు భూముల విలువలు ఉన్నాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోనూ రూ.20 లక్షలకు పైనే భూముల ధరలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ అద్భుతమైన ఆర్థికశక్తిగా ఎదుగుతోందని కేసీఆర్ చెప్పారు. అధికారుల అద్భుత పనితీరుతోనే ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయన్నారు. మిషన్ భగీరథతో భూగర్భ జలాలు పెరిగాయని స్పష్టం చేశారు. విద్యుత్శాఖ కృషితో నిరంతర విద్యుత్ వస్తోందని ఉద్ఘాటించారు. కేబినెట్ భేటీని సుదీర్ఘంగా జరిపి.. అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాం. అధికారుల కృషితో విద్యుత్, మంచినీళ్లు, హరితహారం కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
తెలంగాణలో ఉద్యోగులకు మరింతగా జీతాలు పెరుగుతాయి. ఇంకో గంట ఎక్కువ పనిచేసైనా సరే అభివృద్ధి సాధించి ఫలితం పొందుతాం. గుంట, అరఎకరం ఉన్న రైతు చనిపోయినా.. 8 రోజుల్లోనే బీమా డబ్బులు వస్తాయి. దళితబంధుపై కొందరు తెలిసీతెలియక మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎరువులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పెట్టామన్నారు. ఏ వర్గాన్నీ వదలకుండా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నామని వెల్లడించారు. మహాత్ముల పేర్ల మీద పేద విద్యార్థులకు రూ.20 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నామని పేర్కొన్నారు. రాజకీయ సుస్థిరతతోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/