తన కెబినెట్ మంత్రులను హెచ్చరించిన సిఎం మమతా బెనర్జీ

బిజెపి ట్రాప్ చేయాలని చూస్తోంది. చాలా అప్రమత్తంగా ఉండండి..

CM Mamata Banerjee warns her cabinet …

కోల్‌కతాః బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాగ్రత్తగా ఉండండి..’స్టింగ్ ఆపరేషన్’ నిర్వహిస్తారంటూ తన కెబినెట్ మంత్రులను హెచ్చరించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఏజెన్సీలు ఇప్పుడు చాలా కష్టపడి పనిచేస్తున్నాయి. వారు మన ప్రతి కదలికను గమనిస్తున్నాయి. బిజెపి ట్రాప్ చేయాలని చూస్తోంది. చాలా, చాలా అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలచే నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, తన ప్రభుత్వ ప్రతినిధులుగా క్లీన్ ఇమేజ్‌తో ఉండాలన్నారు.

ప్రజా జీవితంలో ఉండే మీకు క్లీన్ ఇమేజ్ ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు… అయినా ఇది అత్యవసరం అంటూ పలు సూచనలు చేశారు. ఫైలును క్షుణ్ణంగా చదవకుండా ఎవరూ ఎక్కడా సంతకం చేయవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. సాదా తెల్లకాగితంపై వ్రాసిన ఏదీ సంతకం చేయరాదు. సంతకం పైన, క్రింద వేరే ఏదైనా వ్రాయగలిగే స్థలం లేకుండా జాగ్రత్త వహించాలి.

అదే సమయంలో మంత్రుల కార్లలో ఎరుపు, నీలం రంగు లైట్లను నిషేధించిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆమె సూచనల మేరకు కోల్‌కతాలో ఏ మంత్రి పోలీసు-పైలట్‌ను తీసుకెళ్ల కూడదు. జిల్లా మంత్రులు హైవే మీదుగా వచ్చిన తర్వాత కోల్‌కతాలోకి ప్రవేశించే ముందు పైలట్‌ను వదిలివేయాలి. అదేవిధంగా కోల్‌కతా మంత్రులుగా ఉన్నవారు కోల్‌కతా సరిహద్దు దాటే ముందు పైలట్‌ను తీసుకెళ్లొద్దని సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/