ఈనెల 14న వికారాబాద్లో సిఎం కెసిఆర్ పర్యటన
హైదరాబాద్ః సిఎం కెసిఆర్ ఈనెల 14న వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల వెల్లడించారు. మంగళవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ నిఖిల సమావేశమయ్యారు.
వికారాబాద్ పట్టణ పరిసరాల్లో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, రోడ్ల మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ నిఖిల ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులెవరూ సెలవుల్లో వెళ్లకూడదని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసన సభ్యులు డాక్టర్ ఆనంద్, యాదయ్య, నరేందర్రెడ్డి, మహేశ్రెడ్డి, జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణాన్ని, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/