నేడు వికారాబాద్ జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన

హైదరాబాద్ః సిఎం కెసిఆర్ నేడు వికారాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సిఎం వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. టిఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభిస్తారు. 61 కోట్ల రూపాయల వ్యయంతో.. సకల సౌకర్యాలతో కొత్త కలెక్టరేట్ను ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 42 విభాగాలు ఇక్కడ నుంచి పనిచేయనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నారు. ఇందుకోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా శాసనసభ్యులు ఏర్పాట్లు చేశారు. సీఎం సభకు భారీగా తరలిరావాలని ప్రజల్ని కోరారు.
అంతకంటే ముందు కేసీఆర్ హైదరాబాద్ అబిడ్స్లో పర్యటిస్తారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నేడు ఆబిడ్స్ జీపీవో కూడలి వద్ద నిర్వహించనున్న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆబిడ్స్ జీపీఓ సర్కిల్, నెక్లెస్ రోడ్డు కూడలి ప్రాంతాల్లో ఏర్పాట్లను సీఎస్ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. జీపీవో సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు, రంగుల బ్యానర్లు మైకులు ఏర్పాటు చేయాలని అధికారులకు సోమేష్ కుమార్ ఆదేశించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/