విద్యుత్ సంస్కరణల ముసుగులో దోపిడీః సిఎం కెసిఆర్‌

మోటార్లకు మీటర్లు పెట్టాలని బిల్లులో లేదన్న రఘునందన్

cm kcr speech in assembly

హైదరాబాద్ః తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, సభలో విద్యుత్ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా బిజెపి సభ్యుడు రఘునందన్ రావు మాట్లాడుతూ..వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలన్నది సవరించిన బిల్లుల్లో ఎక్కడా లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. 2020లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన సవరించిన విద్యుత్ బిల్లులో…. రాష్ట్రం ప్రభుత్వం పలు కేటగిరీల వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలను రద్దు చేయాలని కేంద్రం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. మేం సబ్సిడీలు ఇస్తుంటే కేంద్రం తొలగించమంటోంది అంటూ వాదనల్లో నిజంలేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. అంత్యోదయ అనే సిద్ధాంతంపైనే పుట్టిన బిజెపి పేదలకు అన్యాయం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించదని అన్నారు. వ్యవసాయానికి, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని బిజెపి ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు.

అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడారు. అభివృద్ధిని అంచనా వేసేందుకు అనేక కొలమానాలు ఉంటాయని తెలిపారు. ఏ దేశం ఎంత విద్యుత్ వాడుతుందనేది ప్రధాన సూచిక అని వివరించారు. విద్యుత్ చట్టంపై కేంద్రం పెత్తనం ఏంటని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మాట మాత్రం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేశారని ఆరోపించారు. లోక్ సభలో కూడా మాట్లాడే పరిస్థితి లేదని, తిరిగి విపక్షాలపైనే దాడులు చేసే పరిస్థితి ఉందని అన్నారు. ఎంత హార్స్ పవర్ ఉన్న మోటార్లు పెట్టారన్న దానితో పనిలేకుండా తెలంగాణ రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇచ్చామన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణల ముసుగులో రైతులను దోచేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని అన్నారు. ఏపీలోని శ్రీకాకుళంలో కేంద్రం విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టిందని తెలిపారు. దాంతో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ధర్నా చేపట్టారని కెసిఆర్ వివరించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/