భారీ వ‌ర్షాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులకు సీఎం ఆదేశం

హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌పై సీఎస్ సోమేశ్ కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షించారు. గులాబీ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ ఆస్తి నష్టం కలగాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సి.ఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీస్, రెవిన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలని సిఎం స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో రెవిన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం కలుగ కుండా పటిష్టమైన చర్యలు చేపట్టరాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే, హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్ లలో ఉన్న ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు , చెరువులు, కుంటలు, బ్రిడ్జి ల వద్ద ప్రత్యేకంగా అధికకారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు.

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమీషనర్లు, ఎస్.పిలని ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/