తెలంగాణ‌లో రేపు 24 గంట‌ల ‘జ‌న‌తా క‌ర్ఫ్యూ’

రాష్ట్ర ప్రజలకు సీఎం కెసిఆర్ పిలుపు

cm kcr
cm kcr

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరా రేపు తెలంగాణలో 24గంటల జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కెసిఆర్ పిలుపునిచ్చారు . రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించి సామాజిక బాధ్యతను చాటాలని కెసిఆర్ అన్నారు. శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. షాపులు, మాల్స్‌ స్వచ్ఛందంగా మూసివేయాలన్నారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు ఇందుకోసం చర్యలు తీసుకోవాలని కోరారు.రాష్ట్రంలో 21 కరోనా కేసులు నమోదయ్యాయని, వారందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని వెల్లడించారు.

పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా అనుమానితులపై నిఘా కోసం తెలంగాణ చుట్టూ 52 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. 78 సంయుక్త కార్యాచరణ బృందాలను కూడా మోహరించామని, ముఖ్యంగా ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటివరకు 11 వేల మంది అనుమానితులను గుర్తించి వారిని పరిశీలిస్తున్నామని, అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సరిగా తెలియడంలేదని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి చేతులెత్తి దండం పెడుతున్నానని, దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చినవారి కారణంగా సమాజం మొత్తం వ్యాధిగ్రస్తమయ్యే ప్రమాదం వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో స్వయంనియంత్రణ అవసరమని స్పష్టం చేశారు. అలా ముందుకు వచ్చినవారికోసం అంబులెన్స్ నుంచి మాత్రల వరకు ప్రభుత్వమే అన్నీ భరిస్తుందని హామీ ఇచ్చారు. పరిస్థితి తీవ్రత కారణంగా తాము మీడియా సమావేశంలో విలేకరులను కూడా మూడు మీటర్ల ఎడంతో కూర్చోబెట్టామని, అందరి క్షేమం దృష్ట్యా ఇలాంటి చర్యలు తప్పడంలేదని వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/