దేశంలో బిజెపి అరాచకాలు పరాకాష్ఠకు చేరాయిః సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌లో కేజ్రీవాల్, భగవంత్ మాన్ లతో కలిసి కెసిఆర్ ప్రెస్ మీట్

cm-kcr-press-meet-along-with-delhi-cm-arvind-kejriwal-and-punjab-cm-bhagwant-mann

న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బిజెపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో బిజెపి అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని అన్నారు. బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని తెలిపారు. బిజెపియేతర ప్రభుత్వాలను పనిచేయనివ్వడంలేదని మండిపడ్డారు.

ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా బిజెపి వెళుతోందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునే ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పాటించకుంటే ఎలా? అని నిలదీశారు. కేంద్రం తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందని, ఇకనైనా కేంద్రం కళ్లు తెరవాలని కెసిఆర్ హితవు పలికారు. వెంటనే ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతం అని పేర్కొన్నారు.

రాజ్ భవన్ లు బీజేపీ రాష్ట్ర కార్యాలయాలుగా మారాయని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలనుకుంటున్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో మోడీ వంగి వంగి కోతి దండాలు పెట్టినా ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని, అయినా బిజెపికి బుద్ధిరాలేదని పేర్కొన్నారు. ఇదే వరుసలో త్వరలోనే దేశం మొత్తం కూడా బిజెపికి గుణపాఠం చెబుతుందని కెసిఆర్ స్పష్టం చేశారు.

కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయడంలేదని అన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకే అధికారాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని భగవంత్ మాన్ విమర్శించారు. బిజెపియేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్ లను వాడుకుంటున్నారని ఆరోపించారు.