నేడు శాసన మండలికి కవిత నామినేషన్
కవిత పేరును నేడు అధికారికంగా ప్రకటించనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను ఖరారు చేశారు. ఈమేరకు సిఎం కెసిఆర్ నిర్ణయించారు. కవిత పేరును అధికారికంగా నేడు ప్రకటించే అవకాశం ఉంది. పేరు ప్రకటించిన వెంటనే ఆమె నామినేషన్ దాఖలు చేస్తారు. ఇక ఈ స్థానం నుంచి ఎన్నికయ్యే వారు జనవరి 2022 వరకు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత కూడా వారే కొనసాగే అవకాశం ఉండడంతో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముజీబ్, పార్టీ నేతలు నర్సింగ్రావు, ఈగ గంగారెడ్డి తదితరులు పోటీపడ్డారు. అయితే, సిఎం కెసిఆర్ మాత్రం కవితవైపే మొగ్గుచూపారు.
2015లో ఇక్కడి నుంచి ఎన్నికైన భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ అయింది. రేపటితో నామినేషన్ల సమర్పణ గడువు ముగియనున్న నేపథ్యంలో కవిత నేడు తన నామినేషన్ను దాఖలు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లలో అత్యధికులు టిఆర్ఎస్ వారే కావడంతో కవిత గెలుపు నల్లేరు మీద నడకేనని చెబుతున్నారు. కవిత పేరు ఖరారైన నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్రావు నేడు తన నామినేషన్ను ఉపసంహరించుకోనున్నారు.
తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్ చేయండి:https://epaper.vaartha.com/