బీజేపీ పై మరోసారి నిప్పులు చెరిగిన కేసీఆర్..
బిజెపి సర్కార్ ఫై మరోసారి టీఆరఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే..శఠగోపం తప్పదని అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలు మోసపోతే గోసపడే పరిస్థితులు వస్తాయి. వచ్చిన తెలంగాణను మళ్లీ గుంటనక్కలు వచ్చి పీక్కొని తినకుండా, పాత పద్దతికి మళ్లీ పోకుండా, మళ్లీ పరిస్థితులు దిగజారకుండా, వారి రాజకీయ స్వార్థాలకు బలికాకుండా ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికే రాలేదు తెలంగాణ. ఇవాళ ఎవడూ పడితే వాడు అది మాట్లాడుతున్నాడు. మన బాధలు చూడననివారు మన అవస్థలు పట్టించుకోనివారు, నవ్విన వారు అడ్డం పొడవు మాట్లాడుతున్నారు. ఆనాడు ఉద్యమం జరిగినప్పుడ 14 సంవత్సరాలు పోరాటం చేశాను. చావు అంచు దాకా వెళ్లి ఈ రాష్ట్రాన్ని సాధించాను. తెచ్చే వరకు తెచ్చాను. తెచ్చిన తర్వాత మీరు ఆశీర్వాదం ఇస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలన్నీ కొనసాగాలి. పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయ రంగాల్లో ముందుకు పోవాలి. ఇంకా లాభం జరగుఉతంది. తాను కలలుగన్న బంగారు తెలంగాణ సాధ్యమైతదని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ దేశానికి ఏం చేశారని దేశ ప్రధానిని కూడా అడిగానని కేసీఆర్ తెలిపారు. రైతులకు, గిరిజనులకు, ముస్లిం మైనార్టీలు, దళితులకు ఎవరికీ మేలు జరిగింది. మేలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఉచితాలు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కరెంట్ బిల్లులు వసూలు చేయాలని రైతుల మెడపై కత్తి పెట్టారు బీజేపీ నాయకులు. బీజేపీ జెండాను చూసి మోసపోతే కరెంట్ బావుల కాడ మీటర్లు పెట్టి.. శఠగోపం పెట్టి, పెద్ద షావుకార్ల కడుపులు నింపుతారు. ఆ ప్రమాదం రావాల్నా..? కరెంట్ ఫ్రీగా రావాల్నా..? మీరే ఆలోచించుకోవాలి. మరి రావాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ జెండా పట్టుకుంటే మళ్లీ పాత కథనే వస్తుంది.
ఇవాళ గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. బ్యాంకులను దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద షావుకార్లకు లక్షల కోట్ల రూపాయాలు దోచిపెట్టారు. దీనికేనా బీజేపీ జెండాలు అడ్డు తెచ్చేది. వికారాబాద్కు కేసీఆర్ ఏ తక్కువ చేసిండు. కరెంట్ ఇవ్వలేదా? మంచినీళ్లు ఇవ్వలేదా? కలెక్టరేట్ ఇవ్వలేదా? నిధులు ఇవ్వలేదా? సంక్షేమ పథకాలు అమలు కాలేదా? ఇవన్నీ మీరు ఆలోచించాలి. గోల్ మాల్ కావొద్దు. నియోజకవర్గానికి 1000 మంది చొప్పున కర్ణాటక బోర్డర్కు తీసుకెళ్లాలని స్థానిక టీఆర్ఎస్ నాయకత్వానికి సూచిస్తున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతుందో పరిశీలించండి. అక్కడ కల్యాణలక్ష్మి అమలవుతుందా? ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నారా? ఉచిత కరెంట్ ఇస్తున్నారా? అని సీఎం ప్రశ్నించారు. 57ఎండ్ల నిండిన 10 లక్షల మందికి నిన్నటి నుంచి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఎన్నికలు వస్తే రకరకాల వాళ్లు వస్తుంటారని, ప్రజలు అన్నీ విని ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులతో ఇప్పుడున్న పరిస్థితులను బేరీజ్ వేసుకోవాలని కోరారు.