అసలు గోయల్‌ కు ధాన్యం కొనుగోళ్ల పై అవగాహన ఉందా..? అని ప్రశ్నించిన కెసిఆర్

వరి కొనుగోలు విషయంలో కేంద్రం తో తాడోపేడో తేల్చుకునేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. ఈరోజు ఢిల్లీ వేదికగా కేంద్రం ఫై వరి దీక్షకు దిగింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఎండగట్టారు. ఎన్నికలు వస్తేనే ప్రధాని నరేంద్ర మోడీకి రైతులు గుర్తుకువస్తారని.. ఆ తర్వాత వారిని పట్టించుకోరని విమర్శించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం దిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేసారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీయూష్‌ గోయల్‌ ఉల్టా పల్టా మాట్లాడుతున్నాడని ..అసలు గోయల్‌ కు ధాన్యం కొనుగోళ్ల పై అవగాహన ఉందా అని నిలదీశారు. ధాన్యం సేకరణకు దేశంలో ఒకే విధానం ఉండాలి.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది.. ఇంతదూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏంటి..? రైతులను కన్నీరు పెట్టిస్తే, గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు బాధాకరం.. నూకలు తీనమన్నాడు.. పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్ మాల్ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

బాయిల్డ్ రైస్, రా రైస్ ఏదైనా కేంద్రం కొనుగోలు చేస్తుందని బండి సంజయ్ చెప్పారని గుర్తు చేశారు.ఇప్పుడు మాట మార్చి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనడానికి కేంద్రం దగ్గర డబ్బులు లేవా? మోడీకి మనస్సు లేదా అని ప్రశ్నించారు. అసలే కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడమేనా బీజేపీ పద్ధతి అని సూటిగా ప్రశ్నించారు. రైతులతో పెట్టుకుంటే మోడీ తట్టుకోలేరని హెచ్చరించారు. బీజేపీని వ్యతిరేకించి మాట్లాడితే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా బీజేపీ పద్ధతి అని మండిపడ్డారు. వరి కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి…లేదనాతె 24 గంటల తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామని కేసీఆర్ హెచ్చరించారు.