కేంద్రం అవివేకం వల్ల ఆహార భద్రతకు ముప్పుః సిఎం కెసిఆర్‌

cm kcr

హైదరాబాద్ః రాష్ట్ర అసెంబ్లీలో నేడు విద్యుత్‌ సంస్కరణలపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సిఎం కెసిఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బిజెపికి పోగాలం దాపురించిందని సిఎం కెసిఆర్‌ విమర్శించారు. వ్యవసాయం, విద్యుత్ రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. సంస్కరణల పేరుతో షావుకార్లకు దోచి పెట్టడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వస్తువులపై ధరలు పెంచుతూ ప్రజలు, రైతుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని, కేంద్ర మంత్రుల అవివేకం వల్ల దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లిందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. కేంద్ర అసమర్థత వల్ల దేశం వెనక్కిపోతోందని ఫైర్ అయ్యారు. బుద్ధుడు, గాంధీ మహాత్ముడు పుట్టిన ఈ నేల మీద బిజెపి మరుగుజ్జులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. చరిత్రలో హిట్లర్, ముస్సోలిన్ వంటి ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారన్న కెసిఆర్…మోడీ, అమిత్ షాకు కూడా అదే గతి పడుతుందని చెప్పారు.


రాజ్యాంగ సంస్థలను ఎగదోలుతూ ప్రతి పక్షాల ప్రభుత్వాలను కూలగొడుతున్నారని సీఎం మండిపడ్డారు. 11 రాష్ట్రాల్లో బిజెపి అనైతికంగా ప్రభుత్వాలను కూలగొట్టిందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కనీసం ముగ్గురు సభ్యులు కూడా లేని బిజెపి .. తమ ప్రభుత్వాన్ని కూలగొడుతామంటూ ప్రగల్భాలు పలుకుతోందన్నారు. ఏక్ నాథ్ షిండేల పేరుతో బెదిరించాలని కేంద్రం చూస్తోందని, కానీ దానికి ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని తేల్చి చెప్పారు. దేశంలో ఏకపార్టీ ఉండాలని అమిత్ షా మాట్లాడుతున్నారని, బిజెపిని దేవుడు కూడా కాపాడలేరని కెసిఆర్ అన్నారు. సైన్యం రిక్రూట్ మెంట్ విషయంలో కూడా కేంద్రం సరిగ్గా వ్యవహరించలేదన్నారు. ద్రవ్యోల్బణం, పేదరికం పెరగడానికి కేంద్ర విధానాలే కారణమని ఆరోపించారు.

బిజెపి నేతలు అసమర్థులు అని సిఎం కెసిఆర్ ఆరోపించారు. వరి వేయాలని రాష్ట్ర రైతులను రెచ్చగొట్టి తీరా పంట చేతికొచ్చాక బీజేపీ నేతలు జాడపత్తా లేకుండా పోయారన్నారు. ధాన్యాన్ని కొనాలని తాము ఎంత మొత్తుకున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఇక్కడి బిజెపి నాయకులు ఒక్కరూ కూడా ధాన్యాన్ని కేంద్రంతో కొనిపించడానికి ప్రయత్నం చేయలేదన్నారు. ఆ సమయంలో నూకల్ బుక్కాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించి రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/