ఈనెల 28న విశాఖకు జగన్, కేసీఆర్..?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నారు. విశాఖలోని శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్ లకు ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. దీంతో ఈ నెల 28న జగన్ శారదాపీఠంకి వెళ్లనున్నారని సమాచారం. రాజశ్యామల యాగంలో కూడా జగన్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్‌ ఈ యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి రావడంతో.. పలుమార్లు శారదాపీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కార్య క్రమానికి వస్తారనే దానికి ఖచ్చితమైన స్పష్టత రావాల్సి ఉంది. తప్పకుండా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని.. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే ఒకే రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు విశాఖకి వస్తే భద్రత కల్పించడం కష్టం కాబట్టి.. నెలాఖరున వచ్చే అవకాశాలున్నాయని ఏపీ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. విశాఖ రానున్న కేసీఆర్‌కు జగన్‌ స్వాగతం పలుకుతారా.. లేదంటే వ్యక్తిగత పర్యటనగా భావిస్తారా అనేది చూడాలి.