నేడు, రేపు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి : సీఎం జగన్ నేడు, రేపు వైఎస్సాఆర్​ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు పులివెందుల, వేంపల్లెలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న సీఎం.. శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.50 గంటలకు పులివెందుల చేరుకుంటారు. ఆర్​అండ్​బీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు.

ఆ తర్వాత 1.30 గంటలకు పులివెందుల చేరుకొని న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 3.05 గంటలకు వేంపల్లె చేరుకుంటారు. 3.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ స్మారక పార్క్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు వేంపల్లె జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ విద్యార్ధిని, విద్యార్ధులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు.

శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.05 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. అక్కడ తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం 8.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగే వైకాపా ప్లీనరీలో సీఎం పాల్గొననున్నట్లు సీఎంవో కార్యాలయ అధికారులు వెల్లడించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/