‘వైఎస్‌ఆర్ కల్యాణమస్తు’,‘షాదీ తోఫా’ నిధుల పంపిణీ

క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేసిన సీఎం జగన్

CM jagan will be Distributing Financial Assistance under “YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa”

అమరావతిః సిఎం జగన్ వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తూ, షాదీ తోఫా పథకాల కింద నిధులు విడుదల చేశారు. తాడేపల్లి గూడెంలోని క్యాంప్ ఆఫీసులో శనివారం జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం.. కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఆడ బిడ్డల పెళ్లిళ్లు ఆర్థికంగా భారం కాకూడదనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పర్యాయం ప్రభుత్వం మొత్తం 4,536 కుటుంబాలకు రూ.38.13 కోట్లను పంపిణీ చేసింది.

అంతకుముందు సీఎం జగన్ వివిధ జిల్లాల కలెక్టరెట్లు, సంబంధిత శాఖ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. లబ్ధిదారులెవరూ ప్రభుత్వసాయానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకునేందుకు జనవరి చివరి వరకూ గడువిచ్చామన్నారు. ఈ పథకం కింద ఏడాదిలో నాలుగు పర్యాయాలు నిధులు విడుదల చేస్తామని సీఎం చెప్పారు.

కాగా..అర్హులైన లబ్ధిదారులు గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ పథకాన్ని గత ప్రభుత్వం 2018-19లోనే నిలిపివేసిందని జగన్ ప్రభుత్వం ఆరోపించింది. గతంలో కంటే రెట్టింపు నగదును ప్రస్తుతం అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎస్సీ లబ్ధిదారులకు సాయాన్ని రూ.40 వేల నుంచి రూ. లక్షకు పెంచినట్టు తెలిపారు.