ప్రతిపక్షంలో ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించిన.. సీఎం

అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ అదే పనిచేయడం విడ్డూరంగా ఉంది

jv satyanarayana murthy
jv satyanarayana murthy

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారయణ మూర్తి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందంటూ ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించిన సీఎం జగన్‌, అధికారంలోకి వచ్చాక అదే పనిచేయడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. విశాఖ రాజధాని ఏర్పాటులో భాగంగా ల్యాండ్‌పూలింగ్‌కు పాల్పడడం అంటే భూకుంభకోణానికి తెరతీస్తున్నట్లేనని ఆరోపించారు. ఈరోజు ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలోని ముదపాక, ఓజోన్‌ వ్యాలీలో ల్యాండ్‌ పూలింగ్‌ జరిగిందని, ఈ సందర్భంగా ఎన్నో మోసాలు వెలుగు చూశాయని గుర్తు చేశారు. ఆ సమయంలో ల్యాండ్‌ పూలింగ్‌ను వ్యతిరేకించిన వైఎస్సార్‌సిపి ఇప్పుడు అదే పని ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. పూలింగ్‌ పేరుతో పేదల జీవనోపాధికి ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములను తీసుకోవడం వారి కడుపుకొట్టడమేనన్నారు. ఆ భూములు సేకరించవద్దని, ఇందుకోసం జారీ చేసిన 72వ నంబరు జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/