మరికాసేపట్లో అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుండి సీఎం జగన్ బయలుదేరి 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. ఉదయం 10.40 – 12.30 గంటల వరకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌..అక్కడ జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీని సీఎం జగన్ ప్రారంభిస్తారు. రూ. 2,350 కోట్లతో ఈ కంపెనీ ఎర్పాటు కానుంది.

సుమారు రూ.1,152 కోట్ల పెట్టుబడులతో తొలి దశ యూనిట్‌ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లును పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పరిశీలించారు. అనంతరం మరికొన్ని పరిశ్రమలకు కూడా సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. తర్వాత, మధ్యాహ్నం 12.40 గంటలకు అచ్యుతాపురం నుంచి విశాఖపట్నం బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు మర్రిపాలెంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ నివాసానికి చేరుకొని.. ఇటీవల వివాహమైన నూతన వధూవరులను సీఎం జగన్‌ ఆశీర్వదించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ తిరిగి తాడేపల్లి చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.