కొన్ని సడలింపులతో కర్ఫ్యూ కొనసాగుతుంది.. సీఎం జగన్

థర్డ్ వేవ్ వస్తే తాము సన్నద్ధంగా ఉన్నామని ఉద్ఘాటన

అమరావతి: సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ వ్యాప్తి-కట్టడి, హెల్త్ క్లినిక్స్, ఉపాధి హామీ, ఇళ్ల పట్టాలు, ఖరీఫ్ సన్నద్ధత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, క్రమంగా పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతోందని తెలిపారు. అయినప్పటికీ, ఈ నెల 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని అధికారులకు నిర్దేశించారు. ఇప్పటివరకు 69 లక్షల మందికి సింగిల్ డోసు ఇచ్చామని, 26 లక్షల 33 వేల 351 మందికి రెండు డోసులు ఇచ్చామని తెలిపారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని, 89 శాతం మంది కరోనా బాధితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారని సీఎం జగన్ వివరించారు.

ఏపీలో పిల్లల వైద్యం కోసం 3 అత్యాధునిక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వైజాగ్, కృష్ణా-గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో నెలకొల్పుతామని వివరించారు. ఇక, కరోనా థర్డ్ వేవ్ పైనా సీఎం చర్చించారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే అందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/