నేడు క‌ర్నూలులో పర్యటించనున్న సీఎం జగన్

భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న జగన్

అమరావతి : సీఎం జగన్ నేడు క‌ర్నూలులో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనేపథ్యంలో సీఎం జ‌గ‌న్ భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తాండా వద్ద ఇంటెగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన కర్నూలుకు బయల్దేరుతారు. అక్కడి నుంచి నేరుగా ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

ఈ ప్రాజెక్టును గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ (పంప్డ్ స్టోరేజ్) ను ఉత్పత్తి చేయనుండటం ఈ ప్రాజెక్టు విశేషం. ఒకే యూనిట్ నుంచి మూడు విభాగాల ద్వారా ఇన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం.

ఈ ప్రాజెక్టు ద్వారా 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్, 550 మెగావాట్ల విండ్, 1,680 మెగావాట్ల హైడల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయబోతున్నారు. ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాల భూమిని కంపెనీకి అప్పగించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/