అన్ని జిల్లా కేంద్రాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయండి : సీఎం జగన్

విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసిన జగన్

అమరావతి: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అక్కడ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది తెలుగువారు అక్కడ చిక్కుకుపోయారు. ఇండియాకు వచ్చే పరిస్థితి లేక వారు బిక్కుబిక్కుంటూ బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్న విషయాన్ని జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జైశంకర్ ప్రతిస్పందిస్తూ అందరినీ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఉక్రెయిన్ పొరుగున ఉన్న దేశాల మీదుగా ప్రత్యేక విమానాల్లో అందరినీ తీసుకొస్తామని తెలిపారు.

ఉక్రెయిన్ లోని తెలుగు వారి తరలింపుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల పర్యవేక్షణలో అన్ని జిల్లా కేంద్రాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్కడున్న తెలుగువారి నుంచి సమాచారం వస్తే విదేశాంగ శాఖకు తెలియజేయాలని చెప్పారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ, సీఎంఓ అధికారులు, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/