కరోనా నివారణ చర్యలపై సిఎం సమీక్ష

అమరావతి: సిఎం జగన్ కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కరోనా టెస్టులు, క్వారంటైన్లలో వసతులు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు, కాల్ సెంటర్ల పనితీరు, వైద్య సిబ్బంది నియామకాలు, హోం క్వారంటైన్లో ఉన్నవారికి కల్పిస్తున్న సదుపాయలు వంటి అంశాలపై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించారు. ‘ఆస్పత్రి సేవలు అద్వాన్నంగా ఉన్న జిల్లాలపై ముందుగా ప్రత్యేక దృష్టిపెట్టాలి. రెండు వారాల్లో పరిస్థితి మెరుగుపడాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలి. ఆరు నెలల తర్వాత మెరుగు పడకపోతే చర్యలు తీసుకోవాలని’ సిఎం సూచించారు.
జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కో ఆర్డినేషన్ బాధ్యతలు జేసీలకు అప్పగించాలని సిఎం ఆదేశించారు. ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని కూడా పెంచారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న 3వేల రూపాయల ప్రోత్సాహకాన్ని 5వేల రూపాయలకు, సిజేరిన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని 1000 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, హెల్త్ సెక్రటరీ జవహర్రెడ్డి హాజరయ్యారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/