ఉత్తరాంధ్రకు తుపాను.. సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: ఇటీవల తుఫాన్ ప్రభావంతో దక్షిణాంధ్ర కకావిలమైతే, తాజాగా మరో తుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రకు ‘జావద్‌’ తుపాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎం కార్యాలయం అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమీక్షలో.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల ప్రత్యేక పునరావాస కేంద్రాలను తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాలను గుర్తించి, లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం దిశానిర్ధేశం చేశారు.

తుపాన్‌ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో తుపాన్‌ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు సీఎం అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాన్‌ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/