బాగా చదువుకుంటేనే తలరాతలు మారుతాయి: సీఎం జగన్
జగనన్న విద్యా దీవెన పథకం 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు విడుదల
అమరావతి: జగనన్న విద్యా దీవెన పథకం అమలులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. 2021 ఏప్రిల్ 19న మొదటి విడత.. జూలై 29న జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేశాం. పేదరికం చదువుకు అవరోధం కారాదు. ఉన్నత చదువులు అభ్యసిస్తేనే తల రాతలు మారుతాయి. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న ఫీజులు కాలేజీలకు తప్పకుండా కట్టాలి. లేకుంటే నేరుగా కాలేజీలకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది’ అని సీఎం జగన్ అన్నారు.
ప్రతి ఇంట పేదరికం పోవాలి, మన తలరాతలు మారాలన్న.. ప్రతివర్గం పెద్ద చదువులు చదువుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చదువుకునేవారి సంఖ్య బాగా పెరగాలన్న సీఎం.. బాగా చదువుకుంటేనే తలరాతలు మారుతాయన్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు.. దాని నుంచి బయటపడాలన్నారు. నూటికి నూరుశాతం అక్షరాస్యత కానేకాదు, పిల్లలను వందశాతం గ్రాడ్యయేట్లగా నిలబెట్టాలన్నది మన లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నామన్న జగన్.. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తున్న ఘనత ఒక్క వైస్సార్సీపీకే దక్కుతుందన్నారు
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/