నేడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

విజయవాడ : సీఎం జగన్ శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. సోమవారం ఉదయం దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అమ్మవారిని దర్శించుకుని, సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ జె.నివాస్, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారని చెప్పారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. అనంతరం వేదపండితులు ఆయన్ని ఆశీర్వదిస్తారని తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/