రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్

ప్ర‌కాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు మొద‌టి ద‌శ ప‌నుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ ఇవాళ శంకుస్థాప‌న చేశారు. రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్బంగా జగన్ అన్నారు. రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికే కాదు, ఈప్రాంతం రూపురేఖలు మారుతాయని.. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమల వచ్చినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకు వచ్చామని జగన్ అన్నారు. పోర్టులోకాని, దీనికి అనుబంధంగా ఉన్న వచ్చే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని వెల్లడించారు.

రాష్ట్రంలో దాదాపు 6 పోర్టులు ఉన్నాయి.. కృష్ణపట్నం, కాకినాడలో 2, విశాఖపట్నం, గంగవరం తదితర పోర్టుల ద్వారా ఎగుమతులు, దిగుమతులు కొనసాగుతున్నాయని తెలిపారు. దీనికి మరో 4 పోర్టులు అదనంగా వస్తున్నాయి. భావనపాడు, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను నిర్మిస్తున్నామన్నారు. వీటిద్వారా మరో 100 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వస్తుందని.. దీంతో పాటు 9 ఫిషింగ్‌ హార్బర్లు కూడా కడుతున్నామని ఈ సందర్బంగా జగన్ చెప్పుకొచ్చారు.

ఇక శంకుస్థాపన పూజా కార్యక్రమాల్లో జగన్ పాల్గొని, సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డ్రెడ్జింగ్‌ పనులను ప్రారంభించి, పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. మొదటి దశలో రూ.3,786 కోట్లతో 850 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ పోర్టు ఎన్నో ఏళ్ళుగా ప్రతిపాదనలకే పరిమితమైన విష‌యం తెలిసిందే. 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. అలాగే, ప్రజలకు సహాయ, పునరావాస కార్య‌క్ర‌మాల‌కు రూ.175.04 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది.