గ‌డ్క‌రీతో ర‌హ‌దారుల నిర్మాణంపై జగన్ చ‌ర్చ‌

కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో చ‌ర్చించిన‌ జ‌గ‌న్.. ముగిసిన‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న

న్యూఢిల్లీ: ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఉద‌యం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జగన్ స‌మావేశ‌మై ర‌హ‌దారుల నిర్మాణాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. గ‌డ్క‌రీకి జ‌గ‌న్ వేంక‌టేశ్వ‌ర స్వామి చిత్రప‌టాన్ని అందించారు. నితిన్ గ‌డ్క‌రీతో స‌మావేశం అనంత‌రం జ‌గ‌న్ ఢిల్లీ విమానాశ్ర‌యానికి వెళ్లారు. కాసేప‌ట్లో ఆయ‌న‌ ఏపీ చేరుకోనున్నారు.

గడ్కరీతో జగన్ చర్చించిన అంశాలు..

విశాఖ- భోగాపురం బీచ్‌ కారిడర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు.. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సీఎం జగన్‌ వివరించారు.

< విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు.

< విజయవాడ వెస్ట్రన్‌ బైసాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీయే గ్రిడ్‌ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు.

< విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

< విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు.

< రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు.

< రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

< రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వే ల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని కేంద్రమంత్రి గడ్కరీని కోరారు సీఎం జగన్‌.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/