నీ ఆశయాలే నాకు వారసత్వం..సీఎం జగన్

జన్మదిన శుభాకాంక్షలు నాన్నా..సీఎం జగన్

బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలి..మోహ‌న్ బాబు

అమరావతి : నేడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ త‌న తండ్రిని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ‘చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం.. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం.. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం.. నీ ఆశయాలే నాకు వారసత్వం.. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా.. పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా’ అని జ‌గ‌న్ పేర్కొన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జ‌గ‌న్‌ ఇడుపులపాయకు బ‌య‌లుదేరారు. వైఎస్సార్‌ ఘాట్‌లో ఆయ‌న ప్రత్యేక ప్రార్థనలు చేయ‌నున్నారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దేశంలో సంక్షేమ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్సార్ అని, తండ్రి బాటలోనే సీఎం వైఎస్‌ జగన్ పయనిస్తున్నారని ఆయ‌న చెప్పుకొచ్చారు.

తాడేపల్లిలోని వైస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శ్రేణులు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, తొలి నుంచి తాము ఆయ‌న‌తో అడుగులు వేసిన వాళ్లమేన‌ని స‌జ్జ‌ల అన్నారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మోహ‌న్ బాబు ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ‘స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం, పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఆయ‌న పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/