ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం 1000 కోట్లు
క్రిటికల్ కేర్ కోసం 2,380 పడకలు అందుబాటులోకి ..సిఎం
అమరావతి: ఏపి సిఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కొవిడ్19 నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..ఏపి కరోనా ఆసుపత్రుల సంఖ్యను పెంచడంతోపాటు అందులో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే ఆరు నెలల్లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. అలాగే, ఎంత ఖరీదైనా సరే కొవిడ్ రోగుల కోసం మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆశ్రం, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం జీజీహెచ్లను కొవిడ్ ఆసుపత్రులుగా మార్చనున్నట్టు అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా క్రిటికల్ కేర్ కోసం 2,380 పడకలు అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు.
అనంతపురం, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆసుపత్రులలో క్రిటికల్ కేర్ సేవలు అందించేందుకు సిద్ధం చేసినట్టు తెలిపారు. మొత్తం 8 ఆసుపత్రులను క్రిటికల్ కేర్ ఆసుపత్రులుగా మార్చినట్టు అధికారులు వివరించారు. కేసుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్యులు, సిబ్బంది ఉండేలా చూడాలని, భోజనం, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు. ఈసమీక్ష సమావేశంలో డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/