‘ ఓటీఎస్‌’ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఓటీఎస్‌ పూర్తిగా స్వచ్ఛందం..సీఎం జగన్

అమరావతి : సీఎం జగన్ బుధవారం గృహనిర్మాణపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్‌) పూర్తిగా స్వచ్ఛందమని, ఓటీఎస్‌ పథకం ద్వారా అన్నిరకాల సంపూర్ణ హక్కులూ ఇంటి యజమానులకు లభిస్తాయని తెలిపారు. ఓటీఎస్‌పై విపక్షాల రాద్ధాంతాన్ని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ నేతలు ప్రతి పథకంలో చేసినట్లుగానే ఇందులో కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. వారిని పట్టించుకోకుండా ఓటీఎస్ అమలుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

పేదలపై రూ.10 వేల కోట్ల రుణభారాన్ని తగ్గించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ఓటీఎస్‌ను తీసుకొచ్చామని వైఎస్‌ జగన్ తెలిపారు. ఈ పథకం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి, అర్థం చేయించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. రుణాలు మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని లబ్దిదారులకు వివరించి వారిలో ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. ఓటీఎస్ ద్వారా సంపూర్ణ హక్కులు దక్కుతాయని అన్నారు. డిసెంబరు 21 నుంచి రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తామని జగన్‌ చెప్పారు. భవిష్యత్‌లో గ్రామ సచివాలయాల్లోనూ ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/