అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వారిలో ఆనందం నింపారు. సెప్టెంబర్ 30వ తేదీ కల్లా అంగన్‌వాడీ సూపర్‌‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సూపర్‌‌వైజర్ల పోస్టుల భర్తీకి పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించామని.. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామని తెలిపారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్‌షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. పరీక్షల ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబరు 30 కల్లా సూపర్‌వైజర్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

అలాగే అన్ని అంగన్‌వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ చేసిన బియ్యాన్నే పంపిణీ చేయాలని ఆదేశించారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని.. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.