పెన్షనర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్..

ఏపీలో పెన్షనర్లకు అసెంబ్లీ సాక్షి గా సీఎం జగన్ తీపి కబురు తెలిపారు. అర్హులందరికీ వచ్చే జనవరి నుండి రూ. 3 వేల పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ రెండో రోజైన ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. విలువలు , విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నామని.. నాలుగేళ్ల పాలనలో కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా మంచి చేశామని సీఎం తెలిపారు. ఎన్నికలైపోయాక అందరూ నావాళ్లే అని నాలుగేళ్ల పాలనలో నిరూపించామని జగన్ పేర్కొన్నారు. లక్షా 90 వేల కోట్లు పిల్లలు, యువత, వృద్ధులకు నేరుగా అందించామని జగన్ స్పష్టం చేశారు.

గతంలో 39 లక్షల మందికి రూ. 1000 మాత్రమే పెన్షన్ అందేదని, వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.2750 పెన్షన్ ను 64 లక్షల మందికి అందిస్తున్నామని తెలిపారు. వచ్చే జనవరి నుంచి రూ. 3 వేలకు పెంచుతామని జగన్ చెప్పారు. ఏపీ మాదిరిగా పెన్షన్ అందిస్తున్న విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఇక రేషన్ కార్డులు కోటి 46 లక్షలకు పెంచామని జగన్ తెలిపారు. ఏపీ తరహా రెషనింగ్ దేశంలో మరెక్కడ కూడా లేదన్నారు. ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు . ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని జగన్ అన్నారు. గతంలో ఎప్పుడు లేనట్లుగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తు్న్నాయని జగన్ చెప్పుకొచ్చారు.