జర్నలిస్టులకు శుభవార్త..ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

పదవీ విరమణకు ఒకరోజు ముందు కీలక తీర్పునిచ్చిన సీజేఐ ఎన్వీ రమణ

supreme court
supreme court

న్యూఢిల్లీః హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు శుభవార్త వినిపించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణకు ఒకరోజు ముందు ఆయన కీలక తీర్పు ఇచ్చారు. హైదరాబాదులో జర్నలిస్టు సొసైటీ ఇళ్ల స్థలాలకు సంబంధించిన వ్యవహారంలో పాత్రికేయులకు అనుకూల తీర్పును వెలువరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణాలకు పచ్చజెండా ఊపారు. ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లకు ఇళ్ల స్థలాల వ్యవహారంతో పాత్రికేయులకు ఇళ్ల స్థలాల వ్యవహారం ముడిపెట్టరాదని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తాను వ్యాఖ్యలు చేయడంలేదని, కానీ ఓ చిరు పాత్రికేయుడు ఎందుకు ఇబ్బంది పడాలి? అని సూటిగా ప్రశ్నించారు

8 వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు వెలువరిస్తున్నామని సీజేఐ తెలిపారు. జర్నలిస్టులకు భూమి కేటాయించినా అభివృద్ధి చేయలేదని, జర్నలిస్టులంతా కలిసి ఆ భూమి కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్ చేశారని, ఆ స్థలాన్ని జర్నలిస్టులు స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ స్థలంలో పాత్రికేయులు నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చని శుభవార్త చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్, ప్రజాప్రతినిధులకు ఇళ్ల స్థలాల వ్యవహారాన్ని మరో బెంచ్ ముందు విచారణకు తీసుకువస్తామని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/