ఒక్కో మతం పట్ల ఒక్కోలా వ్యవహరించడం సరికాదు

ఏపిలో ఉన్నది క్రైస్తవుల ప్రభుత్వమే.. హిందువుల అనుకూల ప్రభుత్వం కాదు..కమలానంద భారతి

అమరావతి: ఏపిలోని హిందూ దేవాలయాలపై దాడులపై కమలానంద భారతి స్పందింస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తుండటం దారుణమని… ఈ ఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాలని అన్నారు. ఏపీలో ఉన్నది ముమ్మాటికీ క్రైస్తవుల ప్రభుత్వమేనని, ఇది హిందువుల అనుకూల ప్రభుత్వం కాదని చాలా స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

ఏపిలో ఏడాది కాలంలో దాదాపు వంద ఘటనలు జరిగాయని ఆయన అన్నారు. విజయవాడ, అంతర్వేది, బిట్రగుంట, రామతీర్థం వంటి ఘటనలు కలకలం రేపినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. కనీసం దేవాదాయ శాఖ మంత్రి కూడా నోరు విప్పడం లేదని దుయ్యబట్టారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడుతున్నాయని అన్నారు. చిలకలూరిపేటలో క్రైస్తవుల సమాధులను ధ్వంసం చేస్తే రాష్ట్ర హోంమంత్రి స్వయంగా వెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఒక్కో మతం పట్ల ఒక్కో మాదిరి వ్యవహరించడం సరికాదని అన్నారు. లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం దారుణమని చెప్పారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/