చౌటుప్పల్‌లో బస్సు ప్రమాదం ..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్‌ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్ నుజ్జునుజ్జయింది. క్యాబిన్‎లోనే డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్‎లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్‎లను సుమారు రెండు గంటల పాటు శ్రమించి బయటికి తీశారు.

ఇద్దరిని హాస్పటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మృతుడు ఏలూరుకు చెందిన బాలకృష్ణగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.