ఒక క్యారెక్ట‌ర్ బాగోలేనంత మాత్రాన మొత్తం నాట‌కాన్ని ఎలా నిషేధిస్తారు?: హైకోర్టు

మంగ‌ళ‌వారంలోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌న్న హైకోర్టు

అమరావతి: ఏపీలో చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ వైస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ ఆ పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. ఆ నాటకాన్ని నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఆయన కోరారు.

దీనిపై హైకోర్టులో ఈ రోజు విచార‌ణ జ‌రిగింది. నాట‌కంలో ఒక క్యారెక్ట‌ర్ బాగోలేనంత మాత్రాన మొత్తం నాట‌కాన్ని ఎలా నిషేధిస్తార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ప్ర‌శ్నించింది. చింతామ‌ణి పుస్త‌కాన్ని నిషేధించ‌న‌ప్పుడు నాట‌కాన్ని ఎలా బ్యాన్ చేస్తార‌ని అడిగింది. దీంతో ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది స‌మాధానం ఇస్తూ… ప్ర‌భుత్వానికి వ‌చ్చిన రిప్రజెంటేష‌న్ ఆధారంగా బ్యాన్ విధించిన‌ట్లు హైకోర్టుకు తెలిపారు. దీంతో రిప్రజెంటేష‌న్‌ను త‌మ ముందు ఉంచాల‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మంగ‌ళ‌వారంలోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/