ఇంతటి రాక్షస రాజకీయం అవసరమా : చింతమనేని

chintamaneni prabhakar
chintamaneni prabhakar

అమరావతి: హైదరాబాద్‌ శివారు పటాన్‌చెరులో నిర్వహించిన కోడి పందేల వ్యవహారంలో ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చింతమనేని సోషల్‌ మీడియాలో స్పందించారు. కోడిపందేల్లో పాల్గొనని వ్యక్తిని పాల్గొన్నట్లుగా చూపటమే కొందరి జెండా అజెండాగా మారిందని చింతమనేని ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. ఇంతటి రాక్షస రాజకీయం అవసరమా అని ఆయన మండిపడ్డారు. ఇటువంటి నీచమైన ప్రచారంతోనే వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అసత్యాల వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం దగ్గర పడిందన్నారు. ఆరోజు కోసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాక్షస రాజకీయ వికటాట్టహాసానికి త్వరలోనే ముగింపు ఉందని హెచ్చరించారు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని చింతమనేని ప్రభాకర్‌ అన్నారు.

కాగా, రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలో కోడిపందేల స్థావరంపై గత రాత్రి పోలీసులు దాడులు చేశారు. చిన్నకంజర్ల శివారులో కోడిపందేలు ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిపారు. ఘటనాస్థలంలో 70 మంది ఉండగా.. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీశ్, కృష్ణంరాజు, శ్రీనులు బృందంగా ఏర్పడి పందేలు ఆడుతున్నారని డీఎస్పీ తెలిపారు. 21 మందిని అదుపులోకి తీసుకొని రూ.13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్​ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. అయితే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీశ్, బర్ల శ్రీనులు అదుపులో ఉన్నారని డీఎస్పీ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/