గాల్వన్ లోయ నుండి 1.5 కిలోమీటర్ల వెనక్కి భారత్
వెల్లడించిన ఆర్మీ అధికారి

న్యూఢిల్లీ: గాల్వన్ లోయ వద్ద ఉన్న వాస్తవాధీన రేఖ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర చైనా దళాలు వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే భారత దళాలు కూడా వివాదాస్పద ప్రాంతం నుంచి సుమారు 1.5 కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఇక కీలకమైన పాయింట్ 14 వద్దకు పెట్రోలింగ్ నిలిపేసినట్లు భారత దళాలు పేర్కొంటున్నాయి. పాయింట్ 14 వద్దే గత నెలలో రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ గొడవలోనే కల్నల్ సంతోష్తో పాటు 20 మంది సైనికులు వీరమరణం పొందారు.
వాస్తవానికి పాయింట్ 14 వరకు భారత దళాలు ప్రతి రోజూ గస్తీ నిర్వహిస్తూ ఉండేవి. అయితే రాబోయే 30 రోజుల వరకు భారత దళాలు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించడం లేదు. జూన్ 30వ తేదీన జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో ఈ అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఫూట్ పెట్రోలింగ్ నిర్వహించరాదు అని 30 రోజుల మారటోరియం విధించుకున్నారు. అయితే పెట్రోలింగ్ నిర్వహించే అవకాశం కోల్పోవడంతో.. భవిష్యత్తులో భారత దళాలకు ఈ ప్రాంతం మరింత క్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/