చైనాలో 23 సిటీల్లో లాక్ డౌన్..ప్రజల హాహాకారాలు

తిండి, ఇతర అవసరాలకు కొరత
తమను చంపేయాలంటూ ప్రజల విజ్ఞప్తులు

షాంఘై: చైనాలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. దీంతో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్థిక నగరమైన షాంఘైలో పరిస్థితి దారుణంగా ఉన్నది. దీంతో సామూహిక కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. మార్చి 1 నుంచి 9 వరకు 1,80,000 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే 96 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఏప్రిల్ 5 నుంచి దేశంలోని ఆర్థిక రాజధాని షాంఘై సహా 23 సిటీల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, షాంఘై ప్రజల గోస మాత్రం వర్ణనాతీతంగా ఉంది. వారం రోజులుగా ఇంట్లోనే ఉంటుడడం, ఆహారం ఇతర అవసరాలకు కొరత ఏర్పడడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సిటీలోని ప్రజలు తమ అపార్ట్ మెంట్ల నుంచే అరుపులు, కేకల ద్వారా అధికారుల తీరును ఎండగడుతున్నారు.

ఇంతటి లాక్ డౌన్ ను అమలు చేసే బదులు తమను చంపేయాలంటూ వేడుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆ వీడియోలను అమెరికాకు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఎరిక్ ఫీల్డింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అపార్ట్ మెంట్లలోని ప్రజలు ‘యావో మింగ్ లే’, ‘యావో షీ’ అంటూ స్థానిక షాంఘైనీస్ భాషలో మాట్లాడారని, వాటి అర్థాలు బతుకు, చావు అని చెప్పారు. అయితే, ప్రజలు మాత్రం బతుకు కన్నా చావు కోసమే ఎక్కువ అరుపులు వినిపించాయని, అంత దీనంగా అక్కడ పరిస్థితులున్నాయని తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/