చైనాలో మరో కొత్త వైరస్ కలకలం

‘మంకీ బి’తో తొలి మరణం..ఇదే తొలి కేసు, తొలి మరణమన్న ప్రభుత్వం

బీజింగ్ : ఇప్పుడు చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. కోతుల నుంచి మనుషులకు సంక్రమించే ‘మంకీ బి’ వైరస్‌తో ఓ వ్యక్తి మరణించినట్టు చైనా తాజాగా వెల్లడించింది. ఇదే తొలి కేసు, తొలి మరణమని పేర్కొంది. అయితే, అతడితో సన్నిహితంగా ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు లేవని స్థానిక మీడియా తెలిపింది. జంతువులపై పరిశోధనలు చేస్తున్న బీజింగ్‌కు చెందిన ఓ పశువైద్యుడు (57) మార్చిలో రెండు చనిపోయిన కోతుల శరీరాలను ముక్కలుగా చేసి పరీక్షించాడు. అనంతరం అతడు వాంతులు, వికారం వంటి లక్షణాలతో బాధపడ్డాడు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మే 27న సదరు వైద్యుడు మరణించినట్టు అధికారులు తెలిపారు.

వైద్యుడి నమూనాలు పరిశీలించగా ‘మంకీ బి’ వైరస్ కారణంగా అతడు మరణించినట్టు నిర్ధారణ అయింది. చైనాలో ఇంతకుముందు ఇలాంటి వైరస్ ఎవరిలోనూ బయటపడలేదని, ఇదే తొలి కేసు, తొలి మరణమని చైనాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఈ వైరస్‌ను తొలిసారి 1932లో మకాక్స్ అనే కోతి జాతిలో గుర్తించారు. కోతుల నుంచి నేరుగా మనుషులకు సంక్రమించే ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, ఇది సోకితే మరణాల రేటు 80 శాతం వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్‌ను మంకీ ‘బీవీ’గా పిలుస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/