చైనాలో భయపెడుతున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’..పలు నగరాల్లో లాక్‌డౌన్

భారీగా నమోదవుతున్న కేసులు
ఈ వేరియంట్‌తో మరణాలు తక్కువేనంటున్న నిపుణులు

China locks down cities as country battles ‘stealth Omicron’ wave

బీజింగ్: చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పలు నగరాల్లో కరోనా తొలినాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది, నిర్మానుష్యంగా రోడ్లు.. పలు నగరాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్నాయి. ఒమిక్రాన్ ఉప వేరియంట్ అయిన ‘స్టెల్త్ ఒమిక్రాన్’గా పిలుస్తున్న ‘బి.ఎ.2’ కారణంగా పలు నగరాలు క్రమంగా లాక్‌డౌన్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి.

అయితే, ఈ వేరియంట్‌తో మరణాలు సంభవించే అవకాశం లేనప్పటికీ వేగంగా విస్తరిస్తోందని, ఫలితంగా ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాలు అతలాకుతలమయ్యే అవకాశం ఉందని షాంఘై పుడాన్ యూనివర్సిటీకి చెందిన జాంగ్ వెన్‌హాంగ్ పేర్కొన్నారు. గత 24 గంటల్లో 1337 కేసులు నమోదు కావడం, ఒక్క జిలిన్ ప్రావిన్సులోనే 895 కేసులు వెలుగు చూడడంతో ప్రభుత్వం ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. రాజధాని బీజింగ్‌లో ఆరు కేసులు, షాంఘైలో 41 కేసులు నమోదయ్యాయి.

కోటిన్నరకు పైగా జనాభా ఉన్న షెన్‌జెన్ నగరాన్ని ప్రభుత్వం దిగ్బంధించింది. చాంగ్‌చున్ నగరంలో శుక్రవారం నుంచే లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. షెన్‌‌జెన్ వాసులకు ఇప్పటికే మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/