40 దేశాలపై చైనా గూఢచారి బెలూన్లను ఎగురవేసింది: అమెరికా

న్యూయార్క్ః అమెరికా-చైనా దేశాల మధ్య స్పై బెలూన్ వివాదం నెలకొంది. ఇటీవలే అమెరికా గగనతలంలో చైనాకు చెందిన ఓ నిఘా బెలూన్ కనిపించిన విషయం తెలిసిందే. గత శుక్రవారం అట్లాంటిక్ సముద్రంలో ఆ బెలూన్ను అమెరికా పేల్చేసింది. బెలూన్ సాయంతో పలు దేశాలపై చైనా గూఢచర్యం చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఐదు ఖండాల్లో దాదాపు 40 దేశాల సైనిక స్థావరాలపై చైనా నిఘా పెట్టినట్లు అమెరికన్ అధికారి ఒకరు వెల్లడించారు.
‘ఐదు ఖండాల్లోని సుమారు 40 దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా సైన్యం తలపెట్టిన బెలూన్ ప్రాజెక్టును అడ్డుకుని, కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆయా దేశాలతో బైడెన్ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఈ బెలూన్లను చైనా కచ్చితంగా నిఘా కోసమే ఉపయోగించిందని ఇప్పటికే రుజువైంది. బెలూన్ను రూపొందించిన సంస్థతో చైనా సైన్యానికి పూర్తి సంబంధాలున్నాయి. అమెరికాతోపాటు, ఇతర దేశాలపై ఎగిరిన తమ బెలూన్ల వీడియోలను ఆ సంస్థ తమ సైట్లో పెట్టుకుంది’ అని అమెరికన్ అధికారి వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.