భారత్తో పాటు పలు దేశాలపై చైనా కుట్ర
సరిహద్దుల్లో చైనా దురుసుగా వ్యవహరిస్తోంది ..అమెరికా నివేదికలో వెల్లడి
వాషింగ్టన్: చైనా భారత్తో పాటు పలు దేశాలపై కుట్రలపై అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేతసౌధం తాజాగా ఓ నివేదికలో పలు విషయాలు వెల్లడించింది. భారత్తో పాటు తమ పొరుగు దేశాలతో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని చెప్పింది. దేశాల సరిహద్దుల్లో చైనా దురుసుగా వ్యవహరిస్తోందని అమెరికా నేత ఒకరు ప్రకటించిన నేపథ్యంలో శ్వేతసౌధం ఇదే విషయంపై తమ నివేదికలోనూ ఈ విషయాన్ని పేర్కొనడం గమనార్హం. చైనా బలవంతపు సైనిక, పారామిలిటరీ ఆందోళనకు రెచ్చగొడుతోందని అమెరికా చెప్పింది. భారత్చైనా సరిహద్దు విషయంతో పాటు దక్షిణ చైనా సముద్రం, ఎల్లో సీ, తైవాన్ జలసంధి అంశాల్లో చైనా మాటలు ఒకలా ఉంటే, చేతలు మరోలా ఉన్నాయని పేర్కొంది. చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని చెప్పింది.
తమ దేశం ఆర్థికంగా బలపడుతున్న కొద్దీ చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నేత బెదిరింపులు ఎక్కువవుతున్నాయని తెలిపింది. చైనా ప్రయోజనాలను, లక్ష్యాలకు అడ్డొచ్చే వారిని బెదిరించే ప్రయత్నం చేస్తోందని చెప్పింది. ప్రపంచ సమాచార సాంకేతికత వ్యవస్థను కొల్లగొట్టాలని చూస్తోందని తెలిపింది. ఇప్పటికే జాతీయ సైబర్ భద్రత చట్టం ద్వారా సమాచార స్థానికీకరణను చైనా తప్పనిసరి చేసిందని, ఇతర దేశాల సమాచారాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంటుందని తెలిపింది. చైనాను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని పలు దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరముందని తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/