దేశ భద్రతలో వాయుసేన కీలకం..బదౌరియా
అవసరమైతే త్యాగం చేయడమే ఫ్లయింగ్ అధికారుల ధ్యేయం
హైదరాబాద్: హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశం కోసం అవసరమైతే త్యాగం చేయడమే ఫ్లయింగ్ అధికారుల ధ్యేయమని బదౌరియా అన్నారు. దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సరిహద్దుల్లో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామన్నారు. కరోనా రెండో దశ వేళ ఆక్సిజన్ సరఫరాలో వైమానికదళం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు. మా వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. గత ఏడాది కాలంలో భారత శక్తి సామర్ధ్యాలు పెరిగినట్లు ఆయన చెప్పారు.
కాగా, ఎయిర్ఫోర్స్ అకాడమీలో 20,500 గంటల ఫ్లయింగ్ శిక్షణను ఈ బ్యాచ్ పూర్తి చేసిందన్నారు. వైమానిక దళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్ గార్డుగా ఐదుగురు క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారని వివరించారు. బీటెక్ పూర్తి చేసిన 87 మంది ఫ్లయింగ్ అధికారులుగా ఉండటం మంచి పరిణామమని తెలిపారు. ఫ్లయింగ్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/