చెన్నైలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సిఎం స్టాలిన్!
చెన్నైః మాండూస్ తుపాను కారణంగా గురువారం నుంచి తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. దీంతో తినేకి తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించారు.
నిరాశ్రయులకు బియ్యం, పప్పు, బ్రెడ్డు తదితర నిత్యావసర సరకులను అందజేశారు. అదేవిధంగా వరద పరిస్థితి, సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… చెన్నైలో 115 మి.మీటర్ల వర్షంపాతం నమోదైనట్లు చెప్పారు. తుపాను తీరం దాటిన సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు నగరంలో దాదాపు 400 చెట్లు పడిపోయినట్లు సీఎం తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/