చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ ..6 గురు మావోలు మృతి

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోలు మృతి చెందారు. పోమ్రా-హల్లూర్ అటవీ ప్రాంతంలో బీజాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు సహా దాదాపు 40 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న మిర్తూర్ పోలీసులు ఫై అధికారులకు సమాచారం ఇవ్వగా.. సెంట్రల్ రిజర్వు ఫోర్స్, జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టాయి.

ఈ క్రమంలో ఇరు వర్గాలు తారసపడడంతో వారి మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోలు మృతి చెందారు. బలగాలు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. రెండు మృతదేహాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్టు బీజాపూర్ పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు మావోయిస్టులు గాయపడినట్టు తెలిపారు. ఘటన స్థలంలో 303, 315 రైఫిళ్లతోపాటు మూడు ఆయుధాలు, మందుపాతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.