అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో మళ్లీ గ్యాస్‌ లీక్‌..50 మంది అస్వస్థత

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో మరోసారి గ్యాస్‌ లీక్‌ అయ్యింది. దీంతో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్‌ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా వాంతులు, వికారంతో చాలామంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే కొందరికి వైద్యం అందించారు. మరి కొందరిని ఫ్యాక్టరీ బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. హాస్పటల్స్ వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాధితుల్లో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బి షిఫ్ట్‌లో పని చేసేందుకు ఫ్యాక్టరీకి 4 వేల మంది కార్మికులు వచ్చారు. మధ్యాహ్నం సమయంలోనే గ్యాస్ లీక్ అవుతున్నట్లు కొంత మంది ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడి సిబ్బంది ఆ వార్తలను కొట్టి పడేసినట్లు తెలుస్తోంది. సమయం గడిచే కొద్ది వాయువు గాఢత పెరిగి పలువురు మహిళలు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. వెంటనే అక్కడి సిబ్బంది మహిళలందరినీ ఓ గదిలోకి పంపించి డోర్లు మూసేసినట్లు చెబుతున్నారు. అయితే, ఆ గదిలో అప్పటికే విషవాయువు పరుచుకొని ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు తెలుస్తోంది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై, ఆర్తనాదాలు చేయడంతో తలుపులు తెరిచారని.. బాధితులందరినీ బయటకి తరలించారని బాధితుల్లో కొంత మంది చెబుతున్నారు.

ఈ ఏడాది జూన్​లో కూడా ఇదే ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకై పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. సీడ్స్‌ దుస్తుల కంపెనీ, సమీపంలోని పోరస్‌ లాబ్స్‌ను దాదాపు వారం రోజుల పాటు మూసివేసి ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని ఐఐసీటీ సహా ఇతర అధికారులతో రసాయన వాయువు లీకేజీపై నివేదికలు తీసుకున్న ప్రభుత్వం వాటిని ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడం గమనార్హం.