విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటన..అడ్డుకున్న పోలీసులు

రుషికొండ రిసార్ట్స్ కు వెళ్లేందుకు చంద్రబాబు యత్నం
చంద్రబాబు కాన్వాయ్ ని దారిమళ్లించిన పోలీసులు


విశాఖపట్నం: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండలోని హరిత రిసార్ట్స్ నిర్మాణాలను పరిశీలించేందుకు ఆయన బయల్దేరగా, ఎండాడ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ని పోలీసులు నిలిపివేశారు. రుషికొండ వెళ్లేందుకు చంద్రబాబు బృందానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

వాస్తవానికి చంద్రబాబు కాన్వాయ్ బీచ్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉండగా, పోలీసులు ఎండాడ వైపు మళ్లించి జంక్షన్ వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, చంద్రబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. అటు, రుషికొండ వైపు భారీగా తరలి వెళుతున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితను కూడా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు. చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో దాదాపు 200 మంది పోలీసులు రుషికొండ వద్ద మోహరించినట్టు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/