ముగిసిన చంద్రబాబు 36 గంటల దీక్ష ..

తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఫై వైసీపీ కార్య కర్తలు చేసిన దాడికి నిరసన గా తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇదివరకు మూడు సార్లు దీక్ష చేశానని .. 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఇక్కడున్నాయని, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్‌పై దాడి ఉగ్రదాడేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

100 గజాల దూరంలో డీజీపీ ఆఫీస్‌ ఉందని, డీజీపీ సరైన చర్యలు తీసుకుంటే ఇది జరిగేదా..? అని ప్రశ్నించారు. ఏపీని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా పాలసీలు డిసైడ్‌ చేయడానికి వీల్లేదన్నారు. కల్తీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.

తన రాజకీయ జీవితం ప్రారంభమయ్యే సమయానికి జగన్ పాలు తాగే వాడని… పదవి కోసం కుటుంబ సభ్యుల ను కూడా లెక్క చేయడంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు వైయస్ షర్మిల ను వాడుకుని… గెలిచిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు షర్మిలకు అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు.

పట్టాభి తిట్టాడని ఇప్పుడు తన తల్లి విజయమ్మ ను రాజకీయాల్లోకి లాగుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ నేతలపై దాడులు జరిగితే సహించాం.. కానీ డ్రగ్స్ వల్ల పిల్లల భవిష్యత్ పాడవుతోందని.. అందుకే డ్రగ్స్ పై టీడీపీ పోరాటమన్నారు. దీనికి ప్రజల నుంచి సహకారం వచ్చింది కానీ.. ప్రభుత్వంలో చలనం లేదని.. సీఎంకు భయపడి అందరూ సరెండర్ అవ్వాలా..? అని ప్రశ్నించారు. ఇంత మంది సీఎంలు వచ్చారు.. ఏ సీఎం అయినా మద్యం వ్యాపారం చేయడానికి సాహసించారా..? దొంగ సారా వ్యాపారంతో డబ్బులు గుంజుతున్నారని మండిపడ్డారు.

మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్.. మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లు తాకట్టు పెట్టారని.. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం ఆడబిడ్డల తాళిబొట్లని తాకట్టు పెట్టారని అగ్రహించారు. మద్యపానం నిషేధం పేరుతో రేట్లు పెంచేశారని.. మద్యం ధరలు పెంచితే మద్యపానం తగ్గుతుందా..?అని నిలదీశారు.